ఓ రాత్రి కథ
ఓ పాతికేళ్ళక్రితం ఓ తెలుగు కథానిక చదివాను. ఇంటిపేరుతో సహా ఓ అయిదారు అక్షరాలుండే ఓ రచయిత్రి వ్రాసిందని గుర్తు. ఆవిడ పేరు గుర్తులేదు. స్వాతి వీక్లీలోనో, ఆంధ్ర భూమి వీక్లీలోనో చదివిన గుర్తు.
కథ టూకీగా.............
నిజామాబాదు నించో యెక్కడి నించో మన హీరోయిన్ హైదరాబాదుకి బస్సులో ప్రయాణిస్తూ వుంటుంది. ఆవిడకి ఓ ముఫ్ఫై యేళ్ళు. ఇద్దరు పిల్లలూ హైదరాబాదులో చదువుకుంటున్నారు. భర్త ఓ వున్నతోద్యోగి. యేదో వుద్యోగ పని మీదే వెళ్ళి తిరిగి వస్తూంది ఆవిడ.
బస్సులో రకరకాల జనం. వాళ్ళలో తనకి యెడం పక్క వున్న సీట్లలో ఓ అబ్బాయి--35 యేళ్ళవరకూ వుండచ్చు--స్ఫురద్రూపి, గిరజాల జుట్టూ, నవ్వే కళ్ళూ వగైరా--అయినా చాలా హుందాగా వుంటాడు.
తీరా కొంత దూరం వెళ్ళేటప్పటికి, బస్సు బ్రేక్ డౌన్ అవుతుంది. డ్రైవరూ, కండక్టరూ తిప్పలు పడి, వాళ్ళ వల్ల కాక, యేదో పార్టు తెచ్చి వెయ్యాలి--హైదరాబాదు నించే రావాలి--వచ్చేసరికి ఆలస్యం అవుతుంది. రిపేరు అయ్యేసరికి పొద్దున్న ఆరు అవ్వచ్చు. ప్రయాణికులు మీ యేర్పాట్లు చేసుకొంటామంటే, టిక్కెట్టు డబ్బులు తిరిగి ఇచ్చేస్తాం. లేకపోతే, మాతో ఇదే బస్సులో పొద్దున్న 6 గంటలకి బయలుదేర వచ్చు--అని ప్రకటించేస్తారు.
ప్రయాణికులంతా దొరికిన లారీనో ఇంకోటో పట్టుకొని వెళ్ళిపోతూంటారు. హీరోయిన్ ఓ పక్కా, హీరో ఓ పక్కా నిలబడి కాలక్షేపం చేస్తూండగా, అబ్బాయి అడుగుతాడు--మీతో యెవరూ లేరా? ఒక్కళ్ళే వెళుతున్నారా?--అని.
అవునని సమాధానం ఇచ్చిన ఆమె, మీరూ అంతేననుకుంటా--అని, ఇక్కడ నిలబడి దిక్కులు చూసే బదులు, దగ్గర్లో యేదో వూరు వున్నట్టుంది--యెలాగా వెన్నలగానే వుంది కాబట్టి, నడుచుకుంటూ ఆ వూరు చేరితే, పొద్దున్న వరకూ అక్కడెక్కడైనా కూచోవచ్చేమో? అంటుంది.
రెండు ఫర్లాంగులు నడిచేటప్పటికి, ఓ యెత్తరుగుల ఇల్లు కనిపించి, ఇద్దరూ ఓ అరుగు మీద కూర్చుంటారు. అప్పటికే రాత్రి పదకొండు అయి వుంటుంది.
ఆలికిడికి నిద్రలేచిన ఆ యింటావిడ బయటికి వచ్చి, విషయం తెలుసుకొని, 'అయ్యో! తెల్లవార్లూ అరుగుమీద కాలక్షేపం చెయ్యడమెందుకు? మా అబ్బాయీ కోడలూ వేరే వూరు వెళ్ళారు. పిల్లలతో నేనొక్కదాన్నే లంకంత కొంపలో వున్నాను--వాళ్ళ గది కాళీగానే వుంది--మీరు ఆ గదిలో వుండి, పొద్దున్నే లేచి వెళ్ళవచ్చు ' అని మొహమాట పెట్టేస్తుంది వాళ్ళని భార్యా భర్తలనుకొని.
వాళ్ళ మనసుల్లో యేమున్నా, యెందుకొచ్చిన గొడవ అని సరే అనేస్తారు. ఆవిడ ఆ గది తలుపు తీసి, తినడానికి యేవో, మంచినీళ్ళూ పెట్టి, 'తలుపేసుకోండమ్మా--పొద్దున్నే లేపుతాను!' అంటూ వెళ్ళిపోతుంది.
ఆ రాత్రి ఇద్దరూ నిద్రపోలేదు!
ఉదయాన్నే అయిదున్నరకి బయటికి వచ్చి, ఇంటావిడకి చెప్పి, బయలుదేరతారు బస్సు దగ్గరకి.
'మీ ఫోన్ నెంబరు.......' అని అబ్బాయి అడగబోతే, 'ప్లీజ్! నిన్నరాత్రి ఈ దోవలో మనం యెలా అపరిచితులమో, అలాగే విడిపోదాం. మళ్ళీ మనం ఒకర్నొకరు కలవడానికి ప్రయత్నించద్దు. మీకెప్పుడైనా ఇంకో స్త్రీతో ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు మీరూ, నాకవకాశం వస్తే నేనూ ఈ మధుర ఙ్ఞాపకాన్ని గుర్తు చేసుకుందాం--అంతే!' అంటుంది.
తరవాత కథ కంచికీ, మనం ఇంటికీ!
ఆ రోజుల్లోనే ఇలాంటి కథ వ్రాసిన రచయిత్రికి హేట్సాఫ్ చెపుదామా?